“
శోణదండా! ఏ ఏ గుణములు కలిగి ఉండుట చేత బ్రాహ్మణులు, బ్రాహ్మణులు గా పిలవబడతారు? అసత్య దోషములంటకుండా, ఒక బ్రాహ్మణుడు నిజాయితి గా, ‘నేను బ్రాహ్మణుడి ని‘ అని ఏ గుణములు కలిగి ఉండుట చేత చెప్పగలడు?”
“గౌతమా! అసత్య దోషములు అంటకుండా , ఒక బ్రాహ్మణుడు “నేను బ్రాహ్మణుడిని” అని నేనిప్పుడు చెప్పబోయే 5 గుణములు ఉండినచో చెప్పగలడు. అవి; మొదటగా, జనన రీత్యా తల్లివైపున గానీ, తండ్రి వైపున గానీ ఏడు తరముల ముందునించీ మచ్చలేని కుటుంబంలో జన్మించినవాడై వుండాలి; రెండు, వేద మంత్రాలనూ, ఇతర శాస్త్రాలన్నిటినీ వంటబట్టించుకున్న విద్వాంసుడై ఉండాలి. మూడు; చూడగానే నమ్మకాన్ని కలిగించే మనోహరమైన రూపం, మేలిమి చాయ కలిగిన వాడై ఉండాలి. నాలుగు; అపారమైన సద్గుణ సంపద కలిగిన వాడై ఉండాలి. చివరగా; సత్యాన్వేషి, సత్యభాషి, జ్ఞాని అయి ఉండాలి. “
“బ్రాహ్మణోత్తమా! ఈ ఐదు గుణాలనుంచీ, ఏదైనా ఒకటి లేకున్ననూ, అసత్య దోషము అంటకుండా, “నేను బ్రాహ్మణుడిని” అని చెప్పగల వీలున్నదా?”
“శాక్య మునీ! అది సంభవమే. రూపాన్ని, మనిషి శరీరపు చాయనూ వదిలి వెయ్యవచ్చు. రూపంలోనూ, చాయలోనూ ఏమున్నది? “
“శోణదండా! ఈ నాలుగు గుణాలనుంచీ, ఏదైనా ఒకటి లేకున్ననూ, అసత్య దోషము అంటకుండా, “నేను బ్రాహ్మణుడిని” అని చెప్పగల వీలున్నదా?”
“గౌతమా! అది సాధ్యమే! వేదాలనూ మంత్రాలనూ తీసివేయవచ్చు. వేద మంత్రాలలో ఏమున్నది. సరైన జననం, సద్గుణం, జ్ఞానం ఈ మూడూ ఉండిన చాలు“
“విప్రా! ఈ మూడు విషయాలనించి , ఏదైనా ఒకటి లేకున్ననూ, అసత్య దోషము అంటకుండా, “నేను బ్రాహ్మణుడిని” అని చెప్పగల వీలున్నదా?”
“గౌతమా! ఆలోచించిన పిమ్మట ఇది కూడా వీలగును! జనన సంబంధమైన విషయాన్ని విదిచివేయవచ్చు. పుట్టుకతో పని ఏమున్నది? సద్గుణం, జ్ఞానమే కదా బ్రాహ్మణులెవరో నిర్ణయించేది!!”
” అయితే, శోణదండా! ఈ రెండింటి నించి, ఏదైనా ఒకటి లేకున్ననూ, అసత్య దోషము అంటకుండా, “నేను బ్రాహ్మణుడిని” అని చెప్పగల వీలున్నదా?”
“లేదు! లేదు!! గౌతమా.. సద్గుణములున్నచోటనే జ్ఞానం ఉంటుంది. జ్ఞానమున్నచోటనే సద్గుణం ఉంటుంది, ఈ రెండింటిలో దేనినీ విస్మరించి బ్రాహ్మణులు కాజాలరు”
“శోణదండా! అవును! ఇదే నేను మీకు చెప్పదలచినది. సద్గుణము లేని జ్ఞానము లేదు, జ్ఞానము లేక సద్గుణము లేదు. ఈ రెండింటి కలయిక ప్రపంచంలో అత్యుత్తమమైనది గా చెప్పాబడుతుంది . ఇవి ఉన్నవారే *నిజమైన బ్రాహ్మణులు* “
**** ****
ఇది “శోణదండ సుత్త” కి సంక్షిప్త, స్వేచ్ఛానువాదం. గౌతముడూ మరియు శోనదండుడనే బ్రాహ్మణుని మధ్య సంభాషణ. ఎంత అద్భుతంగా ఉంది కద!!
దీన్ని ఒకసారి జాగ్రత్తగా చదివితే, గౌతముడు ఏం చేస్తున్నాడో అర్థం అవుతుంది . బ్రాహ్మణులందరూ చేరిన ఒక ప్రదేశంలో, అక్కడున్న వారిలో విద్వాంసుడు యోగ్యుడు, సద్గుణ సంపన్నుడూ అయిన బ్రాహ్మణునితో “నిజమైన బ్రాహ్మణుడెవరని” ప్రశ్నించడం తెలుస్తుంది.
సరిగ్గా ఇదే సంవాదాన్ని అడ్డుపెట్టుకుని చరిత్ర కారులు, “బ్రాహ్మణిజం పైన గౌతమ బుధ్ధుడు తిరుగుబాటు చేశాడు.” అని రాశారు. దాన్ని చదివి మతిపోగొట్టుకున్న మన మేధావులు కొందరు “కుల వ్యవస్థ” పైన బుధ్ధుడు తిరుగుబాటు చేశాడని వారికి వారు అనేస్కుంటారు. సంతోషం!! కానీ అంతటితో ఊరుకోరు, ఇలాంటి భావాలు కాలక్రమేణా పాఠ్యాంశాలవుతాయి. ఇలాంటి భావజాలాలున్నవారు రాజ్యాంగాలూ రాస్తారు!
అసలు తిరుగుబాటు అంటే ఏంటి? దీనిని తిరగబడ్డం అంటార? కార్ల్ మార్క్సు కాపిటలిజం మీద బూర్జువా సిధ్ధాంతాలమీదా తిరగబడ్డాడు. ఎలా తిరగబడ్డాడు? తనదైన ఒక కొత్త సిధ్ధాంతాన్ని ప్రతిపాదించి. అంతే కానీ తను చెప్పేది “నిజమైన” కాపిటలిజం అని కాదు. కాల్విన్ కాథొలిక్కుల మీద ఎలా తిరగబడ్డడు? “మీరు నిజమైన కాథొలిక్కులు కాదు” అని చెప్పి కాదు . మీ చర్చి డెవిల్ చర్చి అని చెప్పి తిరగబడ్డడు. మరి నిజమైన బ్రాహ్మణుడెవరో చెప్పే గౌతముడు, తిరుగుబాటుదారుడెలా అయ్యడు?
మేధావులు, సమాజపు తీరుతెన్నుల ను ప్రభావితం చెయ్యగల స్థితిలో ఉన్నవారూ అత్యంత భాద్యతాయుతంగా నడుచుకోవాలి. రాబోయే తరాల బుర్రల్లో విషం నింపబోయేముందు క్షణకాలం విచక్షణ ఉపయోగించి చూడాలి. మనిషి ఎంత గొప్పవాడైతే, వాడు చేసే తప్పొప్పుల పర్యవసానాలు అంత తీక్షణంగా ఉంటాయి.
November 26, 2008 at 7:34 pm
అనగనగా ఒక ఊళ్ళో ఓ నిరుపేద విద్యార్థి ఉండేవాడు(మామూలు గా బ్రాహ్మణుడుండేవాడు, కానీ ఇలా రాస్తే మన సంస్కర్తలు ఒప్పుకోరు. చరిత్ర తిరగేసి మరీ చీరేస్తారు!) సరే, కథలోకొద్దాం! మన పేద విద్యార్థిది తన కుటుంబాన్ని కూడా సరిగ్గా చూసుకోలేని ఆర్థిక పరిస్థితి. కానీ గొప్ప పండితుడు. శాస్త్రాలన్నీ అవపోశన పట్టాలని కోరిక గలవాడు. దినమంతా కష్టపడి పని చేసి సంధ్యవేళ తన అర్ధాంగిని కూర్చోబెట్టుకుని, శాస్త్రాల్లోని మంత్రాలను వల్లెవేసి ఆమెకి వినిపించేవాడు.(ఇప్పట్లో లా టీవీ సీరియళ్ళు లేవు కాబట్టి, ఆమె కూడా శ్రధ్ధగా వినేది అనుకుందాం.)
ఒక సంధ్య వేళ ఎప్పటి లాగానే, తన భార్యకు ఈయన మంత్రాలు వల్లె వేయటం మొదలెట్టాడు తేడా ఏంటంటే ఆమె ఇప్పుడు ఒట్టి మనిషి కాదు. ఆ మoత్రాలను ఆమెతో పాటు గా గర్భస్థ శిశువు కూడా వింటున్నాడు! విన్నవాడు ఊరుకున్నడా ఊఁహు! ఊరుకుoటే మనం కథెందుకు చెప్పుకుంటాం? “మీరు పలికే మంత్రం మీద ధ్యాస ఉంచండి. మీ ఉఛ్ఛారణలో దోషం ఉంది.” అన్నాడు. పాపం ఇంకా ప్రపంచంలోనికి అడుగుపెట్టలేదు కద, ఆయనకి ఇక్కడ రూల్సు తెలియవు. ఇక్కడ *పెద్దవాళ్ళు* ఎంత పెద్ద తప్పు చేసినా, కారణాలు ఉన్నకుడా, సవినయంగా అయినా కూడా “మీది తప్పు” అని చెప్పకూడదు. చెబితే ఏంజరుగుతుంది? *పెద్దవాళ్ళు* విచక్షణ కోల్పోతారు. “నీకేం తెలుసురా, నిన్నగాక మొన్నొచ్చావ్, కుఱ్ఱకుంకవి” అని విసుక్కుంటారు, కొండొకచో శపిస్తారు. ఇక్కడా అదే జరిగింది. ఇంకా జన్మించని ఒక పసిగొడ్డు మాటలాడటమే విచిత్రం, అలాంటి మాటలు నన్నెందుకు విసిగిస్తున్నాయి అని ఒక్క క్షణమైనా అలోచించకుండా, ఉద్రేకంలో ఆ బిడ్డని శపించాడు. అసలే సత్యాన్వేషి, సుకర్మల ఫలితంగా మాటకు వచ్చిన శక్తి పని చేసింది. ఆ బిడ్డకి జన్మతః శరీరం మీద ఎనిమిది వంకర్లు వచ్చాయి. అందుకే ఆయన పేరు ఆష్టావకృడు.
ఇంక కథ కొంచెం సీరియస్. అష్ట వంకర్లతో పుట్టిన వారిని సమాజం మామూలుగా బ్రతకనిస్తుందా చెప్పండి? ఆడుగడుగునా హేళనలే, వైకల్యంతో పుట్టిన వారు సమాజంలో వినోదవస్తువులుగా చూడబడతారు(ఇప్పుడు మన మానవ హక్కుల సంఘాలు ఇంకో రకం గా హింసిస్తాయి, కడవలు కడవలు గా వారి మీద జాలి చూపించి, వారి వైకల్యాన్ని అనుక్షణం గుర్తుచేసి; ఇది ఇంకో విషయం!). అయినా ఆయన ఇవేమీ పట్టనట్లు ఉండేవాడు. ఎందుకంటే ఆయన సర్వం తెలిసిన జ్ఞాని. ఆయన ప్రపంచాన్ని చూసే చోటునుంచి వెక్కిరించే ఆకతాయిలకూ, ఆరాధించే శిష్యులకూ తేడా కనిపించదు కాబట్టి.
అత్యుత్తమమైన జ్ఞానాన్ని సరళమైన భాషలో, సూటిగా అందరికి చెప్పాలనే ఆయన జన్మించారు. అలా చెప్పటానికి రాజదర్బారు కంటే వేరొక మంచి చోటు ఉంటుందా?! అందుకని, ఓ మంచిరోజు చూసుకుని(ఏదో మాటవరసకి లెండి, మంచిరోజులు మనకి కావాలి గానీ, జ్ఞానులకెందుకు?)అప్పటి రాజు జనకుని ఆస్థానానికి బయలుదేరాడు. జనకుడంటే మన రాముడిగారి మామగారు కాదండోయ్, ఈయన ఇంకో జనకుడు.మన నాయకుడికి శరీరం సహకరించదు. అసలే ఎనిమిది వంకరలతో జన్మించాడు! జ్ఞానులకు అవేవో శక్తులుండవా ఎక్కడికనుకుంటే అక్కడికి వెళ్ళిపోవడానికి అన్న చెత్త సందేహం నాకూ వచ్చింది. అదే ప్రశ్న మా నాన్నమ్మ ని అడిగా, నన్నోసారి తేరిపార చూసి “ఎందుకుండాలి శక్తులు? అయినా మాయలూ మంత్రాలూ చేసేది ఐంద్రజాలికుడు రా నాయనా, జ్ఞానులు గాదు” అని సుతిమెత్తగా తిట్టింది. ఛీ! ఎదవ సదువు ఈమాత్రం జ్ఞానమూ లేదు అని తిట్టికున్నా!! ఎక్కడికో వెళ్ళిపోయాం. సరే, మళ్ళీ కథలోకి. మామూలుగా అందరికీ ఒకరోజు పట్టే ప్రయాణం మన కథనాయకుడికి ముప్పయి రోజులు పట్టింది. అర్థం చేసుకోదగిందే!!
చివరాఖరికి మన నాయకుడు జనకుని కొలువు చేరుకున్నాడు. నిండు సభ, రోజువారీ కార్యక్రమాల్తో అందరూ తెగ బిజీ గా ఉన్నారు. ఈయన రూపం, నడకతీరూ చూసి సభాసదులు నవ్వసాగారు. విచక్షణ లేశమైనా లేనివారు మొదలుపెడితే, వారిని చూసి కొందరు, అందురూ నవ్వుతున్నారని ఇంకొందరు.. ఎందుకు నవ్వుతున్నామో తెలియకుండా మరికొందరు. “ఎవడీ పిచ్చి వాడు?”, “వాడి శరీరంలో ఎన్ని వంకర్లో చూడు” “వంకర తిరిగిన ఆ పాదాల్ని చూడు”, “వాడి దుస్తుల్ని చూడు”. పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు. నిర్వేదంగా నిల్చున్నాడు అష్టావకృడు, అందరూ సద్దుమణిగేవరకూ నిశ్చలంగా ఉన్నాడు. వెంటనే ఒక్కసారిగా, గాఠ్ఠీగా నవ్వడం ప్రారంభించాడు. సభమొత్తం దద్దరిల్లిపోయేటట్టు. అవును మరి, శరీరంలోని వంకరలు చూసే అంతగా నవ్వితే, బుధ్ధిలో వంకరలు చూసి సర్వజ్ఞులకు ఇంకెంతగా నవ్వు రావాలి?
సహజంగానే నవ్విన వాళ్లంతా ఖంగు తిన్నారు! రాజు సహా!! “ఇంతమంది నిన్ను చూసి నవ్వుతున్నారు, సిగ్గుపడాల్సింది పోయి ప్రతిగా నువ్వెందుకు నవ్వుతున్నావ్?” అన్నాడు జనకుడు. “నీ లాంటి గొప్ప విద్వాంసుడు, గొప్ప రాజూ ఇంతమంది చెప్పులుకుట్టేవాళ్లను చుట్టూ ఎందుకు ఉంచుకున్నాడా అని అలోచిస్తే నవ్వు వస్తోంది! నువ్వూ చెప్పులుకుట్టే వాడివే, రాజా” అన్నాడు. సభలో నిశ్శబ్దం! ఇంతెకుముందు రాజుతో ఎవ్వరూ అలా మాట్లాడలేదు! అష్టావకృడే కొనసాగిస్తూ “ఎందుకంటే, చెప్పులుకుట్టేవాడే చెర్మానికి విలువ కడతాడు. వాడికి అంతకంటే అలోచించే అవసరం ఉండదు, అలాగే మీరందరు నా చెర్మాన్నీ, ఆకారాన్నీ చూసి నేనటే ఎమిటో అంచనాకు వస్తున్నారు” అప్పుడు అర్థం అవుతుంది జనకుడికి, అష్టావకృడికి తను ఏమి మాట్లాడుతున్నాడో దాని గురించి బాగ తెలుసని! స్వతహాగ విద్వాంసుడు అయి ఉండతం చేత అష్టావకృడిని గుర్తించి, ఆయనతో సంవాదం మొదలు పెడతాడు జనకుడు. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ పేరే, అష్టావక్ర గీత!
అష్టావక్ర గీత మన భగవద్గీత కంటే 5000 సంవత్సరాల పురాతనమైనది. చెప్పదలుచుకున్న విషయాన్ని, సూటిగా, శషభిషలు లేకుండా చెబుతాడు అష్టావక్ర. స్వామి నిత్యానంద చెప్పినట్లు, మనం కృష్ణుడి ని పూజిస్తాం, కానీ ఎవ్వరూ అష్టావకృడిని పూజించరు, కృష్ణుడిని పూజించినట్లుగా. కాబట్టి, వ్యక్తికంటే వారు చెప్పిన విషయాలకు మనం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది, అష్టావకృడి విషయం లో.
November 17, 2008 at 8:55 pm
Recent Comments